చాలాసేపటినుంచి బస్ స్టాప్ లో నిలబడి
ఉంది మీనాక్షి. సిటీ బస్సులు రాలేదు. ఎందువలనో తెలియదు. తన కాలేజీ నుంచి రావడానికి
ముందుగానే బస్సులన్నీ వెళ్ళిపోయాయా?. అలా జరిగి ఉండదు. అలాగే అనుకున్నా వేరే
రూట్లో వెళ్లే బస్సులయినా రావాలిగా. ఒక్క బస్సు కూడా రాలేదు!
రోడ్డుమీద ఆటోలు జోరుగా
వెళ్లిపోతున్నాయి. కొంతమంది నడిచి వెళ్తున్నారు. సిటీ బస్సులు ఎందువల్ల తిరగడంలేదో
మీనాక్షి కి అర్థం కాలేదు.
సరిగ్గా అప్పుడే రోడ్డుకి అవతలివైపు ఉన్న
హోటల్ పక్క పాన్ షాప్ యజమాని యాభైయేళ్ల మనిషి రోడ్డు దాటి మీనాక్షి దగ్గరికి
వచ్చి.. " అమ్మాయ్.. నీకు తెలియదేమో ఇవాళ సిటీబస్సులు తిరగవు. ఆటోలో ఇంటికి
వెళ్లు" అన్నాడు. " ఎందుకండీ?" మీనాక్షి అడిగింది. " సిటీ
బస్సు డ్రైవర్ల మధ్య ఏదో గొడవ జరిగి కొట్టుకుంటున్నారట. అప్పటి నుంచి బస్సులు
తిరగడంలేదు. ఈ విషయం నీకు తెలియదు అనుకుంటాను. రోజులాగే కాలేజీ నుంచి వచ్చి ఇక్కడ
నిలబడ్డావు. ఎంతసేపు నిలబడిన సిటీ బస్సులు రావు. ఆటోలో ఇల్లు చేరు" అని
వెళ్ళిపోయాడు. మీనాక్షికి ఏమీ పాలుబోలేదు. ఆటోలో ఇంటికి వెళ్లవచ్చు. కానీ ఆటో కి
సరిపడా డబ్బులు లేవు. సిటీ బస్సు కి డబ్బులు ఉన్నాయి. ఆటోలో ఇంటికి వెళ్లిన తన
మేనత్త ఆటో వాడికి డబ్బులు ఇవ్వదు. తనని తిట్టిపోస్తోంది. ఆమె వట్టి డబ్బు మనిషి.
పరమగయ్యాళి. నీతి నియమాలు లేవు. డబ్బే ప్రధానం ఆమెకు. డబ్బు కోసం ఎంత నీచానికైనా
సిద్ధపడుతుంది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మీనాక్షి తల్లి ఎంత చనిపోయింది.
మీనాక్షి తండ్రి శ్రీపాదం మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మీనాక్షి ఒక్కతే కూతురు
కావడంతో మీనాక్షిని చెల్లెలు సూర్య లక్ష్మి ఇంట్లో ఉంచాడు. మీనాక్షి పెంపకానికి
చెల్లెలకి కొంత డబ్బు ఇచ్చే ఏర్పాటు చేసుకొని.. శ్రీ పాదం కారు డ్రైవర్ గా పని
చేస్తున్నాడు. అతనికి కూతురు మీద చాలా ప్రేమ. అందుకే శక్తికి మించిన పని అయినా
మీనాక్షిని కాలేజీలో చేర్పించి చదివిస్తున్నాడు. మీనాక్షి ఇంటర్ చదువుతుంది. ఇంటర్
చదువుతున్న డిగ్రీ పూర్తి చేసిన దానిలో కనబడుతుంది. వయసును మించిన ఎదుగుదల.
మీనాక్షికి తల్లి పోలిక వచ్చింది. తల్లి అందంతోపాటు.. తల్లి భారీతరం కూడా
వచ్చింది. ఆలోచనలో ఉండగానే మీనాక్షి ముందు అంబాసిడర్ కారు ఆగింది. అందులో మీనాక్షి
తో పాటు.. కాలేజీలో చదివే అమ్మాయి వకుళ కనపడింది. " మీనాక్షి.. వచ్చి
కారెక్కు. ఈరోజు సిటీబస్సులు తిరగవట." అని మీనాక్షిని పిలిచింది వకుళ.
డ్రైవర్ సీట్లో కూర్చున్న లావుపాటి మనిషి కూడా మీనాక్షి ని పిలిచాడు. "నిన్ను
మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు" అన్నది వకుళ మీనాక్షి సంశయాన్ని చూసి.
మరొకప్పుడయితే మీనాక్షి కారు ఎక్కేది కాదు. కానీ వకుళ పిలవడంతో వెళ్లి కారెక్కి
వకుళ పక్కన కూర్చుంది. కారు బయలుదేరింది. సిటీ బస్సు డ్రైవర్ల గొడవ గురించి వకుళ
చెబుతున్నప్పటికీ వకుళ ఇల్లు వచ్చేసింది. కారు దిగి మీనాక్షికి చెప్పి వకుళ
వెళ్ళిపోయింది. " మీ ఇల్లు ఎక్కడ?" కారు నడుపుతున్న మనిషి అడిగాడు.
మీనాక్షి చెప్పింది. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్లి ఊరి బయటనున్న కాలనీలో ఒక
మెడ ముందు ఆగింది. "ఇక్కడ అపార్టేం?" అనుమానంగా అడిగింది మీనాక్షి.
"ఈ ఇంట్లో నా భార్య అనారోగ్యంతో ఉంది. ఒక ముఖ్యమైన మందు సీసా ఇవ్వాలి. నువ్వు
కూడా దిగిరా" అన్నాడు. " నేనెందుకు?" " చెబుతాను. ఈమధ్య నీ
వయసులో అచ్చం నీలాగే ఉండే మా కూతురు జబ్బు చేసి చనిపోయింది. ఆ దిగులుతో నా భార్య
మంచం పట్టింది. నా భార్య మనసు తేలిక పడుతుందని రమ్మంటున్నాను ప్లీజ్. కాదనకు"
అర్థింపుగా అన్నాడు. మీనాక్షిది జాలిగుండె. ఇంకేమీ ఆలోచించకుండా కారు దిగి అతని
వెనుకే వెళ్ళింది. అతని మెడ మీద ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్ళాడు. మీనాక్షి ఆ
గదిలో అతను చెప్పిన అతని భార్య కోసం చూస్తున్నప్పుడు తలుపు మూసి బోల్టు వేశాడు.
గదిలో ఎవ్వరూ లేరు. తలుపు మొయ్యటం చూసి మీనాక్షి భయపడి " ఏమిటి మోసం? నేను
వెళ్ళాలి. తలుపు తెరవండి." అంది ఆందోళనగా. అతను నవ్వి" నువ్వు
వెళ్ళలేవు. నిన్ను మీ అత్త నాకు అమ్మేసింది. డబ్బు కూడా ఇచ్చేశాను. అందుకే
తీసుకొచ్చాను" అన్నాడు. " ఎవరు నువ్వు? నన్నేం చెయ్యబోతున్నావు?"
"నిజం చెప్పినా సరే..! నువ్వు నన్నేం
చేయ్యలేవు. నేను అమ్మాయిల బ్రోకర్ ని. నీలాంటి అందమైన అమ్మాయిలను పట్టుకొని
చెన్నై, ముంబై లాంటి మహానగరాల్లో ఉన్న బ్రోతల్ కంపెనీలకు అమ్ముతూ ఉంటాను. అది నా
వృత్తి. నీ మేనత్త సూర్య లక్ష్మి నిన్ను నాకు అమ్మింది. డబ్బు కూడా ఇచ్చాను.
అవకాశం కోసం చూస్తున్నాను. ఇవ్వాళ వచ్చింది. నువ్వు చిక్కావు. అక్కడ నీకు ఏ లోటు
ఉండదు. ఖరీదైన బట్టలు, నగలు, నీకు మంచి ఫ్యూచర్ వుంటుంది. డబ్బుకు లోటు వుండదు.
దిగులుపడకు. నవ్వుతూ ఉండు." అన్నాడు.
మీనాక్షికి ఏడుపు వచ్చింది. ఏడుపు
గొంతుతో " నేను నీ కూతురు లాంటిదాన్ని. నన్ను వదిలిపెట్టు" అన్నది
చేతులు జోడించి. " అమ్మాయిల వ్యాపారం చేసే నాకు సెంటిమెంట్ లు ఉండవు. నాకు
డబ్బే ముఖ్యం. నేను నా తమ్ముడు కూతుర్నే చెన్నై కంపెనీ అమ్మాను" అన్నాడు
నవ్వుతూ. " అరిచి గోల చేస్తాను" బెదిరించింది మీనాక్షి. " నువ్వు
అరిచిన ప్రయోజనం ఉండదు. నీ అరుపులు ఎవరికీ వినబడవు." అని పెద్దగా నవ్వాడు.
సరిగ్గా అప్పుడే బయటనుంచి ఎవరో తలుపు గట్టిగా నెట్టారు. బోల్టువుాడి కిందపడింది.
తలుపు తెరుచుకోగానే మీనాక్షి తండ్రి శ్రీపాదంతో పాటు నలుగురు పోలీసులు లోపలికి
వచ్చారు. వాళ్లని చూసి అతడు పరిగెత్తబోయాడు. పోలీసులు అతనిని గట్టిగా
పట్టుకున్నారు. తండ్రిని చూసి మీనాక్షి సంతోషంతో.. " నాన్న నేను
ఇక్కడున్నట్లు నీకెలా తెలిసింది?" అన్నది. " నేను బస్ స్టాప్ ముందునుంచి
కారులో వెళుతూ, నువ్వు వీడి కారు ఎక్కడం చూశాను. వీడి గురించి నాకు తెలుసు. వీడి
పేరు జగదీష్. అమ్మాయిల బ్రోకర్ గా ఈ సిటీలో వీడికి మహా గొప్ప పేరుంది. వీడి కారును
ఫాలో అయ్యాను. ఇంట్లోకి తీసుకెళ్లడం చూశాను. నిన్ను మోసంతో తీసుకువచ్చాడని
అర్థమైంది. దాంతో పోలీసులను తీసుకువచ్చాను" చెప్పాడు శ్రీపాదం. జగదీష్
గింజుకుంటున్నాడు పోలీసుల చేతుల్లో.." లక్ష్మి అత్తే నన్ను వీడికి
అమ్మిందట" మీనాక్షి చెప్పింది. శ్రీ పాదం పోలీస్ ఇన్ స్పెక్టర్ తో అదే
చెప్పాడు. " ఎవర్నీ వదిలేది లేదు. ఆమెకి శిక్ష తప్పదు. పదండి ఆమెను కూడా
పట్టుకుందాం" అన్నాడు ఇన్ స్పెక్టర్. అమ్మాయిల బ్రోకర్ జగదీష్ ను
ఎక్కించుకుని పోలీస్ జీపు సూర్యలక్ష్మి కోసం బయలుదేరింది.
గ్రహణం
Reviewed by Smartbyte group
on
August 29, 2018
Rating:

No comments: